23, డిసెంబర్ 2016, శుక్రవారం

ఉద్దానం- ఒక గుండె గోడు!

vuddanam-cover
భౌగోళికంగా నేను ఆ ప్రాంతీయేత‌రుడిని.  అయిన‌ప్ప‌టికీ బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి రాసిన ఉద్దానం పుస్త‌కం చేతిలోకి తీసుకున్నాక విస్తుపోవ‌డం నా వంత‌యింది. కార‌ణం- నీళ్లు దానికి అనుబంధ‌మైన ప‌చ్చ‌ద‌నం క‌రువై సీమ కోలుకోలేక‌పోతుంటే.. స‌హ‌జ‌వ‌న‌రుల‌న్నీ ఉండి కూడా క‌ళింగాంధ్ర ఇంకా ఉద్దానం అభివృద్ధికి నోచుకోక‌పోవ‌టం విస్మ‌యానికి గురిచేసింది. అందుకే ఉద్దానం పుస్త‌కం చ‌దివాక క‌ళింగాంధ్ర గురించి క‌లిగిన నా అవ‌గాహ‌న‌ను పంచుకోవాల‌నిపించింది.
క‌ళింగాంధ్ర అంటే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఒక కోణ‌మే తెలుసు. జ‌మీందారీ పోరాటం నుంచి నిన్న‌టి ఉద్దానంలోని సోంపేట ప‌వ‌ర్ ప్లాంట్ వ్య‌తిరేక ఉద్య‌మం వ‌ర‌కు ఆ ప్రాంతానిది విప్ల‌వ‌బాటే అనుకున్నాం. మ‌రికొంచెం గ‌తంలోకి వెళితే అశోకుడ్ని ఎదురించిన చ‌రిత్ర ఉన్న ప్రాంతంగానే ఎరుక‌. కానీ ఉద్దానం వ్యాసాల్లోని వాస్త‌విక‌త‌ను అవ‌గ‌తం చేసుకున్నాక రెండో కోణం కూడా అవ‌గాహ‌న‌యింది. ముఖ్యంగా అక్క‌డి ప్ర‌ధాన పోరాటాల‌కు వెన్నుద‌న్ను ఇచ్చే ఆదోరం సంత‌లాంటి తిరుగుబాట్లు మ‌న‌కు కొత్త స్పృహ‌ను క‌లిగిస్తాయి. కాక‌పోతే ఇలాంటి వివ‌రాలు, విశేషాల‌తో ఉద్దానం పుస్త‌కం నిండిపోయి ఉంటే ఒక చ‌రిత్ర గ్రంథంగానే మిగిలిపోయేది. సాహిత్య విస్తృతికి దూర‌మైపోయేది. అలా కాకుండా ఈ పుస్త‌కంలోని ప‌ది వ్యాసాలు వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన‌ది. ఇందులో ఏ పేజీ త‌డిమినా త‌డి ఆర‌ని హృద‌య‌విషాదం క‌దిలిస్తుంది. ఒక చిన్న ప్రాంతం మ‌నుగ‌డ‌లో ఇన్ని వ్య‌థ‌లూ- వెత‌లూ ఉన్నాయా అనిపిస్తుంది.
balleda-narayanamurthyమ‌నిషికి రోగం రావ‌టం స‌హ‌జం. కానీ ఆ రోగం ఎందువ‌ల‌న వ‌చ్చిందో చెప్ప‌డం వైద్య‌రంగానికి సంబంధించి ప్రాథ‌మిక ధ‌ర్మం. అయితే ప‌న్నెండేళ్లుగా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధుల‌కు గురై చ‌నిపోతుంటే మ‌న మ‌హాగొప్ప వైద్య‌రంగం, ప్ర‌భుత్వ యంత్రాంగం వ్యాధికి ఇదీ కార‌ణం అని ఇంత‌వ‌ర‌కూ చెప్ప‌క‌పోవ‌టం ఎంతటి విషాదం. వ్యాధిపై అధ్య‌య‌నాలు చేసిన వారు సైతం ఏమీ తేల్చ‌లేదంటే కిడ్నీ వ్యాధి వెనుక కుట్ర‌కోణం ఉందా అని ప్ర‌భుత్వం స్పందించాలి.
అదీ లేదు. వేలాదిగా చ‌నిపోతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండ‌టం అనేది ప్ర‌జల ప‌ట్ల పాల‌కుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్టే. ఆ ప్రాంతాన్ని ప్రేమించే మ‌నిషిగా బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి కిడ్నీ వ్యాధి చుట్టూ అల్లుకున్న సాలీడు గూడు వంటి వివ‌రాల‌ను ఎంతో స‌హ‌నంతో, సంయ‌మనంతో వివ‌రించిన తీరు గుర్తించ‌త‌గ్గ‌ది. అక్ష‌రానికి కేవ‌లం ఆవేశం ఉంటే స‌రిపోదు. ఆలోచ‌న‌, స‌మ‌స్య‌ను వెలుగులోకి తీసుకురావటంలో ఓర్పు అవ‌స‌ర‌మ‌ని నిరూపించాడు బ‌ల్లెడ‌.
చ‌దువుకోసం అక్క‌డి బాల్యం ప‌డే ఆరాటం, వెన‌క‌బాటుత‌నం వ‌ల‌న ఆరిపోయే మ‌త్స్య‌కారుల జీవిత‌గాథ‌ను అంత గాఢంగా అక్ష‌రీక‌రించ‌డం సుల‌భ‌మైన ప‌నికాదు. ఈ విష‌యంలో వ్యాస‌క‌ర్త ర‌చ‌యిత కావడం ఉద్దానానికి ఉప‌క‌రించింది. స‌హ‌జ వ‌న‌రులు క‌లిగి, నీటి ల‌భ్య‌త ఉండి ఒక ప్రాంతం వెనుక‌బాటు వెనుక కార‌ణ‌మేంట‌నే విష‌యాల‌ను ఇందులో ఆర్ద్రంగా చ‌ర్చించారు.
ఉద్దానంలో లేని పంట అంటూ లేదు అని ఇందులో విపులంగా వివ‌రిస్తారు. అస‌లు ఉద్యాన‌వ‌న‌మే వాడుక‌లో ఉద్దానం అయింది. ఒక ప్రాంతంలో కొబ్బ‌రి, జీడి మామిడి, ప‌న‌స‌, మామిడి వంటి వాణిజ్య పంట‌లు వేలాది ఎక‌రాల్లో ఉండ‌టం అంటే మాట‌లు కాదు. చెప్పాలంటే ఒక కొబ్బ‌రి పంట చాలు. స‌రే.. ఇవ‌న్నీ ఉన్నా వీటికి అనుబంధ‌మైన ప‌రిశ్ర‌మో, రూర‌ల్ యూనివ‌ర్శిటీనో లేక‌పోవ‌టం రాష్ట్రానికే న‌ష్టం. ఎందుకంటే ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధితో పాటు ఆదాయాలు అమాంతం పెరిగే అవ‌కాశం ఉంది. అయినా పాల‌కుల దృష్టి ఇటుపోవ‌టం లేదు. అప్ప‌ట్లో వ‌చ్చిన పైలిన్ తుఫాన్ న‌ష్టం ఎలాంటిదో అంద‌రికీ తెలుసు.
అధికారంలోకి రాగానే ఉద్దానం ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తాన‌న్న ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మ‌రిచిపోయినా తుఫాన్‌లు మాత్రం దాడి చేయ‌టం మాన‌లేద‌ని బ‌ల్లెడ గుర్తు చేస్తాడు. వీటి తాకిడికి కుదేల‌వుతున్న రైతాంగాన్ని ఆదుకునే దిక్కులేక‌పోవ‌టం దారుణం. ఇదే స‌మ‌యంలో ఉద్దానం ప్ర‌జ‌ల‌పై వ్యాధులు, ప‌వ‌ర్‌ప్లాంట్‌లు, తుఫాన్‌లు దాడిచేస్తూనే ఉన్నాయి. అందుకే క‌ళింగాంధ్ర నాయ‌కులు సొంత ఎదుగుద‌లే ఎజెండాగా వెళుతున్న తీరును ఆక్షేపించ‌టంతో స‌రిపెట్ట‌డు. వారు ఏమార్గంలో వెళ్లాలో చెప్ప‌డానికి ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త నాయుడ‌మ్మ శిష్యుడు అయిన సైంటిస్ట్ జి. వీర‌చంద్ర‌రావు వంటి వారు ఉద్దానంపై అధ్య‌య‌నం చేశారు. వారు ఇచ్చిన ఎజెండాను వాళ్ల‌ముందు పెట్టి దానిని గుర్తించాల‌ని, ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌నీ ఇందులో కోరాడు. స్థానిక వ‌న‌రుల‌పై, స్థానిక ప‌రిశ్ర‌మ‌ల‌పై స్థానికులు య‌జ‌మానులైతే ఎలాంటి భ‌విష్య‌త్ సాధ్య‌మో స‌వివ‌రంగా చెప్పాడు బ‌ల్లెడ‌. అందుకు న‌వ్యాంధ్ర‌లో ఉద్దానం ఒక జిల్లాగా అవ‌త‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి భావించ‌టం న్యాయ‌మైన‌ది అనిపిస్తుంది.
ఇక క‌ళింగాంధ్ర యాస‌లోనే అక్క‌డి నాయ‌కుల‌కు చుర‌క‌లు అంటించ‌డంలోనూ వ్యాస‌క‌ర్త వెనుదీయ‌ని త‌నం, త‌ద్వారా వారి కార్యాచ‌ర‌ణ ఎలా ఉండాలో చెప్ప‌డం ముగ్ధుల్ని చేస్తుంది. దీనికి బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు రాసిన ముందుమాట ఉద్దానానికి దిక్సూచి వంటిది. అన్నిటికంటే ముఖ్యంగా పుస్త‌కం అట్ట‌వెనుక రాసిన‌ట్టుగా అక్క‌డి స‌మ‌స్య‌ల‌కు గొంతుక‌నివ్వ‌డం కోసం ఉద్దానం యువ‌త‌రం కొంత‌మంది క‌లిసి ఉద్దానం ప్ర‌చుర‌ణ‌లు అని ఒక ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ను తీసుకోవ‌టం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.
సాహిత్య ప్ర‌యోజ‌నాన్ని గుర్తెరిగిన ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల యువ‌త ఎంత‌గానో అభినంద‌నీయులు. వారే ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల పేరిట ఈ పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. వ్యాసాల‌ను అక్ష‌ర కుప్ప‌గా మార్చేయ‌కుండా ఒక ప్రాంతాన్ని యావ‌త్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకున్న‌పుడు సేక‌రించాల్సిన మ్యాపులు, అవ‌స‌ర‌మైన ఫొటోల‌ను జోడించ‌టం వంటి జాగ్ర‌త్త‌ల‌ను ఎంతో శ్ర‌ద్ధ‌గా చేయ‌డం ద్వారా త‌మ ప్రాంత‌మైన ఉద్దానం ప‌ట్ల అక్క‌డి యువ‌తకున్న నిబ‌ద్ధ‌త అర్థ‌మ‌వుతుంది
- ~ December 22, 2016  (సారంగ బుక్స్ సౌజన్యం తో )

20, డిసెంబర్ 2016, మంగళవారం

గుప్పెడంత‌...అమృత క‌ల‌శం


ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క అడుగు.. ముందుకు కదిలితే.. ఎవరెస్ట్‌ శిఖరమైనా తలవంచాల్సిందే. గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి. చలిచీమలు కూడా.. కలిసికట్టుగా సమూహమైతే.. కొండచిలువ కంటే బలంగా మారతాయి. సరిగ్గా ఈ విద్యార్థుల సంకల్పం కూడా అలాంటిదే. పుస్తకాలను తడిమే చేతులతోనే 'గుప్పెడు బియ్యం' చేతపట్టి సమాజసేవకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. సాటివారికి ఏదో ఒక మంచి చేయాలనే గుప్పెడంత సంకల్పమే.. అక్కడ 'అమృత కలశం'గా మారింది. ఇప్పుడు ఆ అమృత కలశమే.. అనేకమంది పేదల కడుపుల ఆకలి తీరుస్తోంది. అందుకే.. ఆ బడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే గుప్పెడు బియ్యంతో.. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాల్సిందే!!
చదువుతోపాటు.. సమాజానికీ ఏదో ఒకటి చేయాలి. ఎలా చేస్తే బావుంటుంది..? ఏంచేస్తే బావుంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టిందే 'అమృత కలశం'. తమకు తామే.. తాము చదివే కళాశాలలోనే 'ఆమృత కలశం' అనే కార్యక్రమాన్ని నిర్దేశించుకుని గత కొన్నేళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్నారు. వారే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు.

కళాశాలలో
విద్యార్థులకు విద్య నేర్పడమేకాదు విద్యతోబాటు సమాజం పట్ల బాధ్యత, సేవాతత్పరత, ఔదార్యం వంటి విలువలను నేర్పించాలనే గురువుల ఒక గొప్ప ఆలోచనే అక్కడ ''అమృత కలశం''గా రూపుదిద్దుకుంది. దీనిద్వారా విద్యార్థులు సమాజంపై సేవాభావాన్ని మరింత పెంపొందించుకుంటూ కొండంత ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఎవరైనా ఈ కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే అక్కడ బియ్యం నిల్వచేసే ఓ పెద్ద డబ్బా కన్పిస్తుంది. దానిపేరే 'అమృత కలశం'. గుప్పెడు బియ్యం
వారంలో రెండు రోజులు ఆ కళాశాల విద్యార్థులంతా ఈ పనిలో నిమగమౌతారు. ప్రతి బుధవారం, శనివారం రోజుల్లో విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్టుకొచ్చి అమృత కలశం డబ్బాల్లో వేెస్తారు. ఈ రెండు రోజుల్లో ఏ విద్యార్థి సంచి తెరిచినా అందులో గుప్పెడు బియ్యం కనిపిస్తాయి.
రెండేళ్ల కిందట
ప్రతి వ్యక్తీ వారంలో ఒకపూట తినే ఆహరంలో పావు భాగాన్ని ఇతరులకు ఇస్తే వారి ఆకలి తీరుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భావిస్తే అకలి కేకలు లేని సమాజం సాధ్యమౌతుందనేది విద్యార్థుల భావన. ఈ కళాశాల డైరక్టర్‌ దుర్గా ప్రసాద్‌తో అదే విషయాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఆ ఆలోచనకు మేము సైతం అంటూ అధ్యాపకులు కూడా విద్యార్థులకు చేయూతను ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంతా కలసి రెండేళ్ళ కిందట ఈ 'అమృత కలశం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచీ ఎలాంటి అవాంతరమూ లేకుండా విద్యార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇందులో పాల్గొంటున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అండగా నిలవడం విశేషం.


విద్యార్థులదే నిర్ణయం
అమృత కలశం ద్వారా సేకరించిన బియ్యం సుమారు రెండు మూడు క్వింటాలు వరకూ సమకూరగానే వృద్ధాశ్రమాలకు, అనాధశ్రమాలకు, అర్హులైన పేదలకు ఆదివారం రోజున అందజేస్తారు. ఈ బియ్యం ఎవరికి ఇవ్వాలి? అని నిర్ణయించేది కూడా విద్యార్థులే. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ప్రేమతో పెట్టుకున్న పేరు 'హ్యాండ్‌ పుల్‌అఫ్‌్‌ రైస్‌'. ఈ కళాశాలలో చదువుతున్న వారిలో అధిక శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన వారే. ఇలా గుప్పెటతో తమ ఇళ్ళ నుంచి విద్యార్థులు తీసుకొచ్చే బియ్యం నెలకు సుమారు ఐదు వందల కేజీల బియ్యం (సుమారు 5 క్వింటాళ్లు) దాకా అవుతుంది. అలా పోగైన బియ్యాన్ని అనాధాశ్రమాలకు, పేదలకు అందజేస్తారు.


ఎందరికో ప్రేరణ
అమృత కలశం కార్యక్రమాన్ని విద్యార్థులే తమకు తాముగా నిర్వహించుకుంటున్నాగానీ.. దీనిని ఈ కళాశాల జాతీయ సేవాపథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) కమిటీ పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలను అందిస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొంటూ ఉండడంతో ఈ కార్యక్రమం మరింత ఎక్కువ మందికి చేరువవుతోంది. ఈ 'అమృత కలశం' ద్వారా సమకూరిన బియ్యాన్ని ఇచ్చిన వారికే ఇవ్వకుండా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కొత్త లబ్ధిదారుల్ని గుర్తిస్త్తూ, వారికి అందిస్తుంటారు. ఈ విషయంలో కచ్ఛితమైన నిబంధనలు పాటిస్తారు. విద్యార్థులు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమం అందరి మన్ననలనూ పొందుతూ ఎంతో మందికి ప్రేరణనిస్తోంది.



సొంతపిల్లలకన్నా ఎక్కువే
నా కొడుకులు వలసపోయారు. ఒక్కదాన్నే ఇక్కడ మిగిలాను. పని చేసుకునే శక్తి లేదు. పిల్లలు అందిస్తున్న బియ్యంతోనే కడుపు నింపుకుంటున్నాను. వారికి నేను ఏమీ కాకపోయినా సొంత పిల్లల కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలైనా ఎంతో రుణపడి ఉన్నాను.
- భైరి నాగరత్నం, సింగుపురం
 

మా ఆకలిని తీరుస్తున్నారు
ఈ పిల్లలది ఎంతో పెద్ద మనసు. కూలి పనిచేయడానికి కూడా అవకాశంలేక, శరీరం సహకరించక ఆకలితో బాధపడే మాలాంటి వారికి ఆత్మబంధువులు ఈ పిల్లలు. వీళ్లు అందించే ఈ బియ్యం పది రోజుల పాటు మా ఆకలిని తీరుస్తున్నాయి.
- గరికవాడు, నరసన్నపేట
 

విద్యార్థుల సంకల్పం గొప్పది
కేవలం తరగతి గదుల్లో చదువు మాత్రమే విద్యార్థులకు సరిపోదు. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల జీవితాలను కూడా చదవాలి. అప్పుడే వారి చదువుకు తగిన లక్ష్యం ఉంటుంది. సామాజిక బాధ్యతకు దూరంగా ఉండే చదువుల వల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఈ కార్యక్రమం చూడడానికి చిన్నపనిలా ఉన్నా గానీ, పెద్ద సంకల్పంతో చేస్తున్నారు. అందుకే, పిల్లలకు అండగా నిలబడుతున్నాం.
- సిహెచ్‌. దుర్గాప్రసాద్‌,
కళాశాల డైరెక్టర్‌ 
 

విలువలు నేర్పే బడి
విద్యతో పాటు జీవిత విలువల్నీ తెలుసుకోవలసిన బాధ్యత మా అందరిపై ఉంది. దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని పాలకులు చెబుతున్నా ఇప్పటికీ పేదలు ఆకలిమంటలతో అల్లాడుతున్నారు. విద్యార్థులుగా మా చేతనైన సాయం చేయాలన్నదే మా సంకల్పం.
- బోర ఈశ్వరరావు, విద్యార్థి

 

సేవలోనే నిజమైన ఆనందం
ఈ కళాశాలలో చేరిన తరువాత నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాను. అందుకే కళాశాలలో మా స్నేహితులు నిర్వహిస్తున్న 'అమృత కలశం' కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాను.
- కళావతి, విద్యార్థిని 
                                                                                 ---బెందాళం క్రిష్ణారావు
                                                                                      

13, డిసెంబర్ 2016, మంగళవారం

ప్రజా సాంస్కృతికోద్యమంలో చెరగని 'ఛాయ' రాజ్



తెలుగు సాహిత్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన కళింగాంధ్ర సాహితీ సాంస్కృతిక ఉద్యమంలో ఆయనిది ఒక చెరగని 'ఛాయ'. అక్షరాలనే సాయుధం చేస్తూ కలం యోధునిగా సామ్రాజ్యవాద సంస్క ృతికి వ్యతిరేకంగా జనచైతన్యం కోసం మహాకవి గురజాడ, శ్రీశ్రీల స్ఫూర్తితో నేను సైతం అంటూ ముందుకు సాగిన ప్రజాకవి ఛాయరాజ్‌. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా విప్లవ రచయిత. అన్నింటినీ మేళవించిన సామాజిక దార్శనికుడు కొంక్యాన ఛాయరాజ్‌. కళింగాంధ్ర సాహితీ వికాసంలోనే కాక తెలుగు సాహిత్య ప్రపంచంలో ఛాయరాజ్‌ది విభిన్నమైన ముద్ర. ఎవరినీ అనుకరించకుండా, అనుసరించకుండా తనదైన సొంత గొంతుకతో సాహితీలోకంలో బలమైన స్వరాన్ని వినిపించారు. అందుకే ఎంతోమంది అమర వీరుల త్యాగాలతో చైతన్య కేంద్రంగా నిలచిన 'శ్రీకాకుళం' 'ఛాయరాజ్‌'కు ఇంటిపేరైంది.
'బహుజన హితాయ... బహుజన సుఖాయ' అంటూ సామాజిక మానవతా విలువలను విశ్వమానవాళికి ప్రబోధించిన బౌద్ధక్షేత్రమైన శాలిహుండం పక్కనున్న గార మండలంలోని కొంక్యానపేట ఛాయరాజ్‌ స్వగ్రామం. 1948 జూలై 6న సూరమ్మ, సత్యనారాయణ దంపతులకు జన్మించారు. బియస్సీ, బిఇడి చదవడమే కాక సామాజిక శాస్త్రంలో ఎంఎ కూడా చేశారు. చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న సమాజం నుంచి స్ఫూర్తి పొందిన ఛాయరాజ్‌ ఏనాడూ నేల విడిచి సాము చేయలేదు. సమాజంలో పీడిత ప్రజల పక్షాన రచయితగా, కళాకారునిగా నిలిచారు. ఆ విషయం ఆయన రచనలన్నింటిలోనూ సుస్పష్టం అవుతోంది. ప్రజల భాషలో ప్రజల కోసం, ప్రజలతో మమేకమై వారి ఉద్యమాలకు వెన్నుదన్నుగా, వారి చైతన్యానికి ప్రేరణగా ఎన్నో రచనలను అందించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పాఠాలు చెప్పి జీతాలు తీసుకోవడానికే పరిమితం కాలేదు. విద్యారంగ సమస్యలపై, ఉపాధ్యాయరంగ సమస్యలపై శాస్త్రీయ విశ్లేషణలనెన్నింటినో ఆయన చేశారు. 1970 నుంచి 1992 వరకూ ఎపిటిఎఫ్‌ శ్రీకాకుళం జిల్లా శాఖలో వివిధ బాధ్యతల్లో ఉద్యమ కార్యకర్తగా సేవలందించారు. 1980లో జనసాహితి సంస్ధలో సభ్యునిగా చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ఆ తరువాత 2007 నుంచి 2013లో తుదిశ్వాస విడిచేవరకూ జనసాహితి రాష్ట్ర అధ్యక్షునిగా తన సాహితీ ప్రస్థానం సాగించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1968కి ముందు, ఆ తరువాత సాగిన గిరిజన రైతాంగ ఉద్యమం, సమరశీల పోరాటం, అతివాద చర్యల ఫలితంగా ఏర్పడిన విషాదాన్ని కథా వస్తువుగా తీసుకుని 'శ్రీకాకుళం' పేరుతో ఉద్యమ కథా కావ్యాన్ని 1989లోనే అందించారు. ఇది చాలా చర్చనీయాంశమైంది. అలా ఆయన శ్రీకాకుళం ఛాయరాజ్‌గా గుర్తింపు పొందారు.

కొండకోనల్లో నివసించే గిరిజనుల హృదయాల్లో ద్రవించే గుండె చెమ్మకు ఇంద్రజాల వాస్తవికతను జోడించి అక్షర చలనచిత్రాన్ని కళింగ వంశధారలో సూర్యబింబంగా ప్రతిబింబించేలా 'గుమ్మ' కావ్యాన్ని 1995లో రాశారు. స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించి అందమైన పదచిత్రాలతో 'నిరీక్షణ' కావ్యాన్ని 1996లో అందించారు. స్త్రీ, పురుష రూపాలను, వ్యత్యాసాలను రూపుమాపి నూతన మనిషిని సృజించాలని వసుంధరను వేడుకున్న ఛాయరాజ్‌ ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరిస్తూ 'దర్శిని' కావ్యాన్ని 1999లో రాశారు. ఈ కావ్యం ఆంగ్లంలోకి కూడా అనువాదం అయింది. అనాథలంతా, అభాగ్యులంతా, అశాంతులంతా, అనేకులింకా, దీర్ఘశృతిలో, తీవ్రధ్యనితో విప్లవ శంఖం వినిపిస్తారని మహాకవి శ్రీశ్రీ ఆనాడు స్వప్నిస్తే ఆ అనాథ బాలుడిని 'బుధడు'గా స్మ ృతి వాక్యంతో విప్లవ బావుకతతో 2003లో కావ్యంగా మలిచారు. అమ్మతో శిశువుకు గల చైతన్యానుబంధాన్ని 'తొలెరుక'గా కావ్యాన్ని, రైతుల కష్టాలను, కన్నీళ్లను 'దుఖ్కేరు'గా కవితా సంకలనాన్ని, జీవన దృశ్యాల వైవిధ్యాన్ని 'రసస్పర్శ'గా 2005లో కావ్యాన్ని తీసుకొచ్చారు. అంతకుముందే 'మట్టి నన్ను మౌనంగా ఉండనీదు' అనే కవితా సంపుటిని 1999లో రాశారు. 2010లో అమరకోశం కవితలు, అనుపమాన కథారూపకాలు రాశారు. 2012లో 'సాహిత్యోద్యమ పతాక మన గురజాడ' వ్యాసాలు, 'నేను సైతం' పేరుతో శ్రీశ్రీ పై వ్యాసాలను సంకలనంగా తీసుకొచ్చారు. 'జీవరసాగ్ని సొగసు-శ్రీశ్రీ' అనే శీర్షికతో వ్యాస సంకలనాన్ని అందించారు. కవితా కథ, పాట, నృత్యగీతం, సాంఘిక, సైద్ధాంతిక, సాహిత్య వ్యాసాలు, సెల్‌ఫోన్‌ కథల పరిచయం, తెలుగు సాహితీ ప్రముఖులపై వ్యాస పరంపరలు ఒక ఎత్తు అయితే- ఆయన రాసిన 'మాతృభాష' కవిత మరొక ఎత్తు. 'పుట్టక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను- ఏడ్వలేను' అనే తెలుగుదనపు నినాదం ఛాయరాజ్‌ కలం నుంచి జనించినదే. ప్రజాకళల్లో నాటకకళ కథానాయకునిగా నిలిచారు ఛాయరాజ్‌.

అవార్డులకోసం ఎదురుచూసే సాహిత్య వేత్తలకు భిన్నమైన చైతన్యం ఛాయరాజ్‌ది. అయినా సరే ఆయనను వెతుక్కొంటూ ఎన్నో అవార్డులు వచ్చాయి. వాటిలో ఫ్రీవర్సు ఫ్రంట్‌, తెలుగు వికాసం అవార్డులు, లాంగుల్య మిత్రుల పురస్కారం, డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ సత్కారం, సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌ కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్క ృతిక సమాఖ్య సత్కారం, సత్యమూర్తి ట్రస్ట్‌ శ్రీశ్రీ పురస్కారం, యగళ్ల ఫౌండేషన్‌ సత్కారం వంటివి ఆయనకు లభించాయి. ఛాయరాజ్‌ రచనలపై ఎంతోమంది విద్యార్థులు ఎంఫిల్‌, పిహెచ్‌డి పరిశోధనలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. వ్యక్తి చైతన్యాన్ని తన రచనల ద్వారా సామాజిక చైతన్యంగా పదునుపెట్టగల సమర్థుడైన ప్రజాకవి ఛాయరాజ్‌. ఆయన ఇతిహాసపు చీకటి కోణంలో దాగి వున్న నిజాలను నేటి తరానికి అందించారు. అందులో భాగంగానే కటక్‌ నుంచి పిఠాపురం వరకూ విస్తరించి ఉన్న కళింగ ప్రజల చారిత్రక విశిష్ఠతను వైవిధ్యభరితమైన కళింగ జీవన సారాన్ని, 2300 సంవత్సరాల క్రితపు కళింగ యుద్ధ నేపధ్యంగా 'కారువాకి' అనే నవలను రాశారు. కళింగ చారిత్రక హృదయ స్పందనని కవితాలయాత్మకంగా ఇందులో చిత్రించారు. అంతవరకూ ఎవరూ స్పృశించని కథా వస్తువును నవలగా తీర్చిదిద్దారు. అనన్యమైన రచనలతో అనంత చైతన్యాన్ని ఆవిష్కరించిన ఛాయరాజ్‌ మహాకవి గురజాడ జయంతికి ఒక్కరోజు ముందే సెప్టెంబర్‌ 20న 2013లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు ఎన్నో చైతన్య కిరణాలను తూరుపు తీరం నుంచి మోసుకొస్తూ తెలుగు సాహిత్య లోకంలో వెలుగులను పంచుతున్నాయి.

రచనలు

 

ముద్రిత రచనలు


లోతు గుండెలు

లేని నన్ను గురించిన
ఆలోచన నీకెందుకు
నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు కానరాని నాకోసం
కలగనడం నీకెందుకు
నీ రూపంలో నా ఆకాంక్షను నెరవేర్చేటందుకు
నేనెందుకు లేనో
ఆ ఆవేదన నీకెందుకు
నీ కందిన నా హృదయాన్ని పదిమందికీ పంచేందుకు
లేని నువ్వు నా కోసం
విలపించుట నీకెందుకు
మన ఉనికి లేమి సారాంశం అందరికీ తెలిపేందుకు
ఇద్దరమూ లేనినాడు
మనను వెతికెవారెందుకు
మిగిలిన శిల్పాన్ని చెక్కి ముందు తరానికందించేందుకు
(ముందూ వెనుకా "పోతున్నప్పు"డల్లా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటున్నారు)

--ఛాయరాజ్

  • శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)(1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
  • గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995
  • దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995 
  • నిరీక్షణ (కావ్యం) - డిసెంబర్ 1996
  • బుదడు (స్మృతి కావ్యం) - జూన్ 2003
  • తొలెరుక (జన్మకావ్యం) - జనవరి 2005
  • దుఖ్కేరు (స్మృతి కావ్యం) - జనవరి 2005
  • రస స్పర్శ (కవిత) - జూలై 2005
  • ది లాంగింగ్ ఐ ( ఎ లాంగ్ పోయం) ఆగష్టు 1999
    (తెలుగు "నిరీక్షణ్"కు ఆర్.ఎస్ & ఎస్.ఎన్.మూర్తి) అనువాదం
  • మట్టి నన్ను మవునంగా ఉండానీదు (కవితా సంపుటి) ఆగష్టు 1999
  • కారువాకి (చారిత్రక కళింగయుద్ధ నవల) సెప్టెంబర్ 2013
  • వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ సుమారు 300 కవితలు.
  • సాహిత్య, సామాజిక అంశాలపై వ్రాసిన వ్యాసాలు (ముద్రితమైనవి)
  • కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
  • సెల్‌ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
  • అనుపమాన కథారూపకాలు 
  • కుంతి 

అముద్రిత రచనలు

  • దుగ్గేరు (నృత్య గీతాలు)
  • అమరకోశం (కావ్యం)
  • చారిత్రక నాటిక

అసంపూర్ణ రచనలు

  • గున్నమ్మ (దీర్ఘ కవిత)
  • టి.ఎన్.కావ్యం ( దీర్ఘ కవిత)

అవార్డులు

  • ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
  • తెలుగు వికాసం అవార్డు (2006)
  • లాంగుల్యా మిత్రుల పురస్కారం (2005) బంగారు పతకం.
  • డా. ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం, 2004, నవంబర్ 18
  • సొ.ను. లిటరరీ ట్రష్టు - కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం - నవంబర్ 2010

( జూలై 6 ఛాయరాజ్‌ జయంతి)
- బెందాళం క్రిష్ణారావు

కథల చిరునామా " కాళీపట్నం"

       

 “

ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 - 1942 వరకు రాసేందుకు ఆసక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాయగలిగేను . ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభిప్రాయాలు పదిమంది తో పందుకోవడమూ ఆగలేదు
—కాళీపట్నం రామారావు



కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు.  ఈయన చేసిన రచనలు సుప్రసిద్ధాలు.
1966లో ఈయన వ్రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

జీవిత విశేషాలు

కారా మాస్టారుగా పిలువబడే "కాళీపట్నం రామారావు" 1924, నవంబరు 9 న శ్రీకాకుళంలో జన్మించాడు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల. స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము. 1972 నుండి నేటివరకు పెన్షనరు గానే జీవితము గడుపుతున్నారు. కాళీపట్నం రామారావు - ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు. కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్యత గల రచనలు చేసారు . . ఈయన చేసిన రచనలు అత్యంత సుప్రసిద్ధమైన రచనలు.
 కవి శివారెడ్డి తో  కాళీపట్నం రామారావు

రచయితగా

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశాడు. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పారు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపారు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్  దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన కథానిలయం విశిష్టమైన యత్నం.
25 వసంతాల తెలుగు కథ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడుతున్న కాళీపట్నం రామారావు
"యజ్ఞం" కథా రచయితగా కాళీపట్నం రామారావు సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు - బ్రహ్మానందరెడ్డి హయాంలో . ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు. కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు. పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.
25 వసంతాల తెలుగు కథ పుస్తకాన్ని అందజేస్తున్న కాళీపట్నం రామారావు గారు

కథానిలయం

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు.
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో సుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.
కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉంటారు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురించారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.

రచనలు


  • యజ్ఞం (నవల)
  • అభిమానాలు
  • రాగమయి
  • జీవధార
  • రుతుపవనాలు (కథా సంకలనం)
  • కారా కథలు 
 
ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్)
  • కథాకథనం
  • కథాయజ్ఞం

పురస్కారాలు

  • బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం-2015
  • ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్) 

  
(వికీపీడియా నుండి)