23, డిసెంబర్ 2016, శుక్రవారం

ఉద్దానం- ఒక గుండె గోడు!

vuddanam-cover
భౌగోళికంగా నేను ఆ ప్రాంతీయేత‌రుడిని.  అయిన‌ప్ప‌టికీ బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి రాసిన ఉద్దానం పుస్త‌కం చేతిలోకి తీసుకున్నాక విస్తుపోవ‌డం నా వంత‌యింది. కార‌ణం- నీళ్లు దానికి అనుబంధ‌మైన ప‌చ్చ‌ద‌నం క‌రువై సీమ కోలుకోలేక‌పోతుంటే.. స‌హ‌జ‌వ‌న‌రుల‌న్నీ ఉండి కూడా క‌ళింగాంధ్ర ఇంకా ఉద్దానం అభివృద్ధికి నోచుకోక‌పోవ‌టం విస్మ‌యానికి గురిచేసింది. అందుకే ఉద్దానం పుస్త‌కం చ‌దివాక క‌ళింగాంధ్ర గురించి క‌లిగిన నా అవ‌గాహ‌న‌ను పంచుకోవాల‌నిపించింది.
క‌ళింగాంధ్ర అంటే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఒక కోణ‌మే తెలుసు. జ‌మీందారీ పోరాటం నుంచి నిన్న‌టి ఉద్దానంలోని సోంపేట ప‌వ‌ర్ ప్లాంట్ వ్య‌తిరేక ఉద్య‌మం వ‌ర‌కు ఆ ప్రాంతానిది విప్ల‌వ‌బాటే అనుకున్నాం. మ‌రికొంచెం గ‌తంలోకి వెళితే అశోకుడ్ని ఎదురించిన చ‌రిత్ర ఉన్న ప్రాంతంగానే ఎరుక‌. కానీ ఉద్దానం వ్యాసాల్లోని వాస్త‌విక‌త‌ను అవ‌గ‌తం చేసుకున్నాక రెండో కోణం కూడా అవ‌గాహ‌న‌యింది. ముఖ్యంగా అక్క‌డి ప్ర‌ధాన పోరాటాల‌కు వెన్నుద‌న్ను ఇచ్చే ఆదోరం సంత‌లాంటి తిరుగుబాట్లు మ‌న‌కు కొత్త స్పృహ‌ను క‌లిగిస్తాయి. కాక‌పోతే ఇలాంటి వివ‌రాలు, విశేషాల‌తో ఉద్దానం పుస్త‌కం నిండిపోయి ఉంటే ఒక చ‌రిత్ర గ్రంథంగానే మిగిలిపోయేది. సాహిత్య విస్తృతికి దూర‌మైపోయేది. అలా కాకుండా ఈ పుస్త‌కంలోని ప‌ది వ్యాసాలు వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన‌ది. ఇందులో ఏ పేజీ త‌డిమినా త‌డి ఆర‌ని హృద‌య‌విషాదం క‌దిలిస్తుంది. ఒక చిన్న ప్రాంతం మ‌నుగ‌డ‌లో ఇన్ని వ్య‌థ‌లూ- వెత‌లూ ఉన్నాయా అనిపిస్తుంది.
balleda-narayanamurthyమ‌నిషికి రోగం రావ‌టం స‌హ‌జం. కానీ ఆ రోగం ఎందువ‌ల‌న వ‌చ్చిందో చెప్ప‌డం వైద్య‌రంగానికి సంబంధించి ప్రాథ‌మిక ధ‌ర్మం. అయితే ప‌న్నెండేళ్లుగా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధుల‌కు గురై చ‌నిపోతుంటే మ‌న మ‌హాగొప్ప వైద్య‌రంగం, ప్ర‌భుత్వ యంత్రాంగం వ్యాధికి ఇదీ కార‌ణం అని ఇంత‌వ‌ర‌కూ చెప్ప‌క‌పోవ‌టం ఎంతటి విషాదం. వ్యాధిపై అధ్య‌య‌నాలు చేసిన వారు సైతం ఏమీ తేల్చ‌లేదంటే కిడ్నీ వ్యాధి వెనుక కుట్ర‌కోణం ఉందా అని ప్ర‌భుత్వం స్పందించాలి.
అదీ లేదు. వేలాదిగా చ‌నిపోతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండ‌టం అనేది ప్ర‌జల ప‌ట్ల పాల‌కుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్టే. ఆ ప్రాంతాన్ని ప్రేమించే మ‌నిషిగా బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి కిడ్నీ వ్యాధి చుట్టూ అల్లుకున్న సాలీడు గూడు వంటి వివ‌రాల‌ను ఎంతో స‌హ‌నంతో, సంయ‌మనంతో వివ‌రించిన తీరు గుర్తించ‌త‌గ్గ‌ది. అక్ష‌రానికి కేవ‌లం ఆవేశం ఉంటే స‌రిపోదు. ఆలోచ‌న‌, స‌మ‌స్య‌ను వెలుగులోకి తీసుకురావటంలో ఓర్పు అవ‌స‌ర‌మ‌ని నిరూపించాడు బ‌ల్లెడ‌.
చ‌దువుకోసం అక్క‌డి బాల్యం ప‌డే ఆరాటం, వెన‌క‌బాటుత‌నం వ‌ల‌న ఆరిపోయే మ‌త్స్య‌కారుల జీవిత‌గాథ‌ను అంత గాఢంగా అక్ష‌రీక‌రించ‌డం సుల‌భ‌మైన ప‌నికాదు. ఈ విష‌యంలో వ్యాస‌క‌ర్త ర‌చ‌యిత కావడం ఉద్దానానికి ఉప‌క‌రించింది. స‌హ‌జ వ‌న‌రులు క‌లిగి, నీటి ల‌భ్య‌త ఉండి ఒక ప్రాంతం వెనుక‌బాటు వెనుక కార‌ణ‌మేంట‌నే విష‌యాల‌ను ఇందులో ఆర్ద్రంగా చ‌ర్చించారు.
ఉద్దానంలో లేని పంట అంటూ లేదు అని ఇందులో విపులంగా వివ‌రిస్తారు. అస‌లు ఉద్యాన‌వ‌న‌మే వాడుక‌లో ఉద్దానం అయింది. ఒక ప్రాంతంలో కొబ్బ‌రి, జీడి మామిడి, ప‌న‌స‌, మామిడి వంటి వాణిజ్య పంట‌లు వేలాది ఎక‌రాల్లో ఉండ‌టం అంటే మాట‌లు కాదు. చెప్పాలంటే ఒక కొబ్బ‌రి పంట చాలు. స‌రే.. ఇవ‌న్నీ ఉన్నా వీటికి అనుబంధ‌మైన ప‌రిశ్ర‌మో, రూర‌ల్ యూనివ‌ర్శిటీనో లేక‌పోవ‌టం రాష్ట్రానికే న‌ష్టం. ఎందుకంటే ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధితో పాటు ఆదాయాలు అమాంతం పెరిగే అవ‌కాశం ఉంది. అయినా పాల‌కుల దృష్టి ఇటుపోవ‌టం లేదు. అప్ప‌ట్లో వ‌చ్చిన పైలిన్ తుఫాన్ న‌ష్టం ఎలాంటిదో అంద‌రికీ తెలుసు.
అధికారంలోకి రాగానే ఉద్దానం ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తాన‌న్న ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మ‌రిచిపోయినా తుఫాన్‌లు మాత్రం దాడి చేయ‌టం మాన‌లేద‌ని బ‌ల్లెడ గుర్తు చేస్తాడు. వీటి తాకిడికి కుదేల‌వుతున్న రైతాంగాన్ని ఆదుకునే దిక్కులేక‌పోవ‌టం దారుణం. ఇదే స‌మ‌యంలో ఉద్దానం ప్ర‌జ‌ల‌పై వ్యాధులు, ప‌వ‌ర్‌ప్లాంట్‌లు, తుఫాన్‌లు దాడిచేస్తూనే ఉన్నాయి. అందుకే క‌ళింగాంధ్ర నాయ‌కులు సొంత ఎదుగుద‌లే ఎజెండాగా వెళుతున్న తీరును ఆక్షేపించ‌టంతో స‌రిపెట్ట‌డు. వారు ఏమార్గంలో వెళ్లాలో చెప్ప‌డానికి ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త నాయుడ‌మ్మ శిష్యుడు అయిన సైంటిస్ట్ జి. వీర‌చంద్ర‌రావు వంటి వారు ఉద్దానంపై అధ్య‌య‌నం చేశారు. వారు ఇచ్చిన ఎజెండాను వాళ్ల‌ముందు పెట్టి దానిని గుర్తించాల‌ని, ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌నీ ఇందులో కోరాడు. స్థానిక వ‌న‌రుల‌పై, స్థానిక ప‌రిశ్ర‌మ‌ల‌పై స్థానికులు య‌జ‌మానులైతే ఎలాంటి భ‌విష్య‌త్ సాధ్య‌మో స‌వివ‌రంగా చెప్పాడు బ‌ల్లెడ‌. అందుకు న‌వ్యాంధ్ర‌లో ఉద్దానం ఒక జిల్లాగా అవ‌త‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి భావించ‌టం న్యాయ‌మైన‌ది అనిపిస్తుంది.
ఇక క‌ళింగాంధ్ర యాస‌లోనే అక్క‌డి నాయ‌కుల‌కు చుర‌క‌లు అంటించ‌డంలోనూ వ్యాస‌క‌ర్త వెనుదీయ‌ని త‌నం, త‌ద్వారా వారి కార్యాచ‌ర‌ణ ఎలా ఉండాలో చెప్ప‌డం ముగ్ధుల్ని చేస్తుంది. దీనికి బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు రాసిన ముందుమాట ఉద్దానానికి దిక్సూచి వంటిది. అన్నిటికంటే ముఖ్యంగా పుస్త‌కం అట్ట‌వెనుక రాసిన‌ట్టుగా అక్క‌డి స‌మ‌స్య‌ల‌కు గొంతుక‌నివ్వ‌డం కోసం ఉద్దానం యువ‌త‌రం కొంత‌మంది క‌లిసి ఉద్దానం ప్ర‌చుర‌ణ‌లు అని ఒక ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ను తీసుకోవ‌టం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.
సాహిత్య ప్ర‌యోజ‌నాన్ని గుర్తెరిగిన ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల యువ‌త ఎంత‌గానో అభినంద‌నీయులు. వారే ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల పేరిట ఈ పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. వ్యాసాల‌ను అక్ష‌ర కుప్ప‌గా మార్చేయ‌కుండా ఒక ప్రాంతాన్ని యావ‌త్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకున్న‌పుడు సేక‌రించాల్సిన మ్యాపులు, అవ‌స‌ర‌మైన ఫొటోల‌ను జోడించ‌టం వంటి జాగ్ర‌త్త‌ల‌ను ఎంతో శ్ర‌ద్ధ‌గా చేయ‌డం ద్వారా త‌మ ప్రాంత‌మైన ఉద్దానం ప‌ట్ల అక్క‌డి యువ‌తకున్న నిబ‌ద్ధ‌త అర్థ‌మ‌వుతుంది
- ~ December 22, 2016  (సారంగ బుక్స్ సౌజన్యం తో )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి