9, జులై 2013, మంగళవారం

బారువా

గ్రామమే ఓ ఆలయం... బారువా
 
 
 
ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.


బారువ సముద్రతీరం... 

ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరుపురాని మహాద్భుతం. మహాభారతం, స్కంధపురాణం వంటి ధార్మిక గ్రంధాలలో బారువ తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరమహోదయానికి ఈ స్థలం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. చివరిసారిగా ఆ శుభదిన 07 ఫిబ్రవరి 2008 నాడు వచ్చింది. ఆ సమయంలో మహోదయ పుష్కర స్నానాలు బారువ తీరం కిటకిటలాడు తుంది. తూర్పుకనుమల నుంచి మొదలై ఒరిస్సా, ఆంధ్రా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, బంగాళాఖాతములో కలుస్తున్న పవిత్ర మహేంద్ర తనయ నదీ సంగమ స్థలమే ఈ బారువ గ్రామం. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడకు వస్తారు. మాఘమాసం, శ్రవణ నక్షత్రం గురువారం ఉదయం 6.39 నిముషాలకు పుష్కర శుభఘడియలు ప్రారంభమవుతాయి.


చారిత్రక నేపథ్యం...
స్కంధపురాణం ఆధారంగా పలువురు సిద్ధాంతుల ప్రకారం... సుమారు 16 వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణం సుదూరంలో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయినది. గొహత్యా మహా పాపమని భావించి పాపవిమోచన కోసం ఆలోచించారు పాండవులు. ఈ నేపథ్యంలో మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తరలించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం అక్కడే వున్న పావన మహేంద్ర తనయ నదీ-సాగర సంగమ స్థలంలో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షం పొందేరని చారిత్రక కథనం.

Baru5పాండవులు సంగమ స్నానం చేసిన అనంతరం సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షంలో యజ్ఞోపవీతం చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని ‘బారాహరాపురం’ గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామం పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమ భాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కథనం. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు.

దీనికి దక్షిణ వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయం, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపా లస్వామి ఆలయం, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడం సంప్రదాయంగా వస్తూ ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి